నటుడు నాజర్ ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువ. ఆయనకు ముగ్గురు కొడుకులున్నారు. అందులో ఒక కొడుకు ఆల్రెడీ సినీ రంగప్రవేశం కూడా చేశాడు. ఆ కొడుకు పేరు లూత్ఫదీన్ బాషా. నాజర్ ప్రధాన పాత్రలో నటించిన ?శైవం? మూవీలో అతడికి మనవడిగా లూత్ఫదీన్ నటించడం విశేషం. ఐతే అందులో లూత్ఫదీన్ ది చిన్న పాత్రే. ఇప్పుడతణ్ని హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని ధనపాల్ పద్మనాభన్ అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఇందులో ఐశ్వర్యా రాజేశ్ తో పాటు ముంబయి భామ సలోని లుతేర్ లను హీరోయిన్లుగా ఎంచుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా సింగపూర్ లో జరుగుతోంది.
ఐతే సలోని లుతేర్ సడెన్ గా ఈ చిత్రం నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చింది. దీనికి ఆమె చెప్పిన కారణం విని డైరెక్టరుకి దిమ్మదిరిగింది. ??నేను ముంబయిలో ఓ ఫేమస్ నాటకంలో నటించి పేరు సంపాదించాను. ఆ సమయంలో దర్శకుడు ధనపాల్ నాకు ఫోన్ చేసి కథ వినిపించారు. కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించాను. షూటింగ్ కోసం సింగపూర్ వెళ్లాను. అయితే అక్కడ చాలా చేదు అనుభవం చవిచూశాను. నాకు కథ చెప్పినట్లు డైరెక్టర్ చిత్రీకరించలేదు. మొత్తం మార్చి తీస్తున్నాడు. అది నచ్చక ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను. నేను ఏ పాత్ర అయినా అంకిత భావంతో చేస్తాను కానీ ఆ పాత్రపై నాకు నమ్మకం కలగడం ముఖ్యం. ఈ సినిమాలో నా పాత్ర నాకు నప్పదని తేలింది. అందుకే తప్పుకున్నా?? అని కుండబద్దలు కొట్టేసింది సలోని. మరి డైరెక్టర్ దీనిపై ఏమంటాడో చూడాలి.