మెగా ఫ్యామిలీలో హీరోల మధ్య వ్యవహారాలు కొంచెం సెన్సెటివ్ గా తయారయ్యాయి. చిరంజీవికి.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మధ్య కొంచెం దూరం పెరగడం.. మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించి ఏ వేడుక జరిగిన పవర్ స్టార్ నినాదాలతో పవన్ అభిమానులు గోల చేయడం.. ఇది శ్రుతి మించే స్థాయికి చేరడంతో అల్లు అర్జున్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టడం.. దీంతో అతడికి మెగా అభిమానుల్లో ఒక వర్గానికి మధ్య వార్ కొనసాగుతుండటం తెలిసిన సంగతే.
ఐతే పవన్ ను వ్యతిరేకించే క్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానుల్లోనూ వ్యతిరేకత పెరిగిపోతుందన్న ఆందోళనతో ఇంకో వైపు చిరంజీవిని అల్లు అరవింద్ - అల్లు అర్జున్ అతిగా పొగడటం.. చిరు లేకుండా పవన్ సహా ఎవరూ లేరని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేయడం.. అలాగే ఎన్నడూ లేని విధంగా చిరంజీవిపై తమకున్న కృతజ్నతను చాటుకునే ప్రయత్నం చేయడం పలుమార్లు గమనించే ఉంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి పునాది వేస్తే.. దాని మీద తామందరం నిలబడి ఉన్నామనే విషయాన్ని పదే పదే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అల్లు అరవింద్ - అల్లు అర్జున్. ఇంతకుముందు జరిగిన ఒక వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. చిరంజీవి తారు రోడ్డేస్తే దాని మీద తామందరం కార్లు నడుపుకుని వెళ్తున్నామని అనడం గుర్తుండే ఉంటుంది.
సరిగ్గా ఇదే కాన్సెప్ట్ ను తాజాగా చిరు కొత్త సినిమా ‘సై రా’ మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ అందుకున్నాడు. చిరంజీవి తారు రోడ్డు వేస్తే దాని మీద పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్.. ఇలా అందరం సాఫీగా ప్రయాణం చేస్తున్నారని.. ఇందుకు వారు చిరంజీవికి కృతజ్నతతో ఉంటారని అరవింద్ వ్యాఖ్యానించడం విశేషం. ఇక్కడ జాగ్రత్తగా పవన్ పేరును కూడా అరవింద్ ఉపయోగించడంలో ఆంతర్యమేంటో అర్థం చేసుకోవచ్చు.