రామ్ చరణ్ భార్య ఉపాసన.. అపోలో హాస్పిటల్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు అనే విషయం తెలిసిందే. మెగాస్టార్ వారసుడు తమ ఇంటి అల్లుడు అయ్యాక.. హాస్పిటల్ ప్రమోషన్స్ కోసం మెగా అనే ట్యాగ్ ని ఈ హాస్పిటల్ బాగానే వాడుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఎవడు సహా కొన్ని మెగా సినిమాల్లో ఆస్పత్రి సీన్ అనగానే.. అపోలో హాస్పిటల్ నే చూపిస్తున్నారు.
ఇలా సినిమాల్లో బ్రాండ్ ప్రమోషన్ సాధారణమే కానీ.. ఇప్పుడీ మెగా వాడకం మరి కాస్త ముదిరింది. రీసెంట్ గా అపోలో జియో అనే యాప్ ని లాంఛ్ చేసింది అపోలో హాస్పిటల్స్. దీన్ని ఇంటల్లుడు రామ్ చరణ్ తో లాంఛ్ చేయించి తననే బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది ఈ ఆస్పత్రి. ఏకైక కూతురును పెళ్లి చేసుకున్న అల్లుడుని ఇలా ప్రచారానికి ఉపయోగించుకోవడం పెద్ద విషయం కాదని చెప్పాలి. అయితే.. ఇప్పుడు మెగాస్టార్ ని కూడా రంగంలోకి దించేయడమే ఆశ్చర్యకరం. రీసెంట్ గా ఈ సంస్థ తమ హాస్పిటల్ లోని ఓ డాక్టర్ కి సన్మాన కార్యక్రమం జరిపింది.
20 వేల కార్డియాక్ సర్జరీలు చేసిన డాక్టర్ విజయ్ దీక్షిత్ ను ఛైర్మన్ ప్రతాప్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా సన్మానించారు. ఇలా హాస్పిటల్ కి చెందిన ఓ కార్యక్రమానికి చిరంజీవిని కూడా ఉపయోగించేసుకోవడం అంటే.. మెగా వాడకం ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఈ సన్మాన కార్యక్రమానికి మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కూడా హాజరయ్యారు.