హీరో అమాయకుడిలా మామూలుగా జీవితం గడుపుతుండటం.. మధ్య మధ్యలో వెళ్లి హత్యలు చేసి రావడం.. ఇలా జెంటిల్మన్ ఛాయలున్న సినిమాలా కనిపించింది డీజే. కామెడీ పార్ట్ చూసినా రొటీన్ అన్న ఫీలింగే కలుగుతోంది. ఐతే ప్రేక్షకులకు ఎలాంటి సర్ప్రైజులు ఇవ్వకుండా ఇలా తెలిసిన కథతో బండి లాగించేయడమంటే ఈ రోజుల్లో చాలా కష్టం. రొటీన్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు గట్టి పంచులే ఇచ్చేస్తున్నారు ఈ మధ్య. అందుకే ఒకప్పుడు మాస్ మసాలాలకే పరిమితమైన హీరోలు కూడా కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారు.
మరి ఇలాంటి సమయంలో డీజే ఎలా నెట్టుకొస్తుంది.. ప్రేక్షకుల్ని ఏమాత్రం సర్ ప్రైజ్ చేస్తుంది అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే డీజే లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు ఉన్నాయని అంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకుల అంచనాలకు అందనట్లుగా ఉంటుందన్నాడు హరీష్. పతాక సన్నివేశంలో ప్రేక్షకులు ఊహించనిగా సర్ప్ రైజ్ ఉంటుందని అతనన్నాడు. ‘డీజే’ ప్రోమోస్ చూస్తే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా ఉందే అని హరీష్ దగ్గర ప్రస్తావిస్తే.. కమర్షియల్ సినిమాలు తీయడం అంత ఈజీ ఏమీ కాదన్నాడు. ప్రతి సన్నివేశం మాస్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు.. వాళ్లు ఏమేరకు కనెక్టవుతారు అన్నది చూసుకుని రాయాల్సి.. తీయాల్సి ఉంటుందని.. అందుకే మిగతా సినిమాల కంటే కమర్షియల్ సినిమాలు చేయడమే కష్టమని హరీష్ అభిప్రాయపడ్డాడు.