టాలీవుడ్ కథానాయకులందరూ తమ మార్కెట్ ను పొరుగు భాషలకూ విస్తరించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారీ మధ్య. దాదాపుగా ప్రతి ఒక్కరూ ద్విభాషా చిత్రాల్లో నటిస్తున్నారు. మంచు విష్ణు కూడా వీళ్ల బాటలోనే నడవనున్నాడు. జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాను తెలుగుతో పాటు.. తమిళ భాషలోనూ చేయనున్నాడు మంచు విష్ణు. ఈ చిత్రాన్ని పూదోట సుధీర్ కుమార్ అనే ప్రొడ్యూసర్ నిర్మించనున్నాడు.
ముందు తెలుగులో చేసి.. దాన్ని తమిళంలోకి అనువాదం చేయడం కాకుండా ఒకేసారి రెండు భాషల్లోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ఈ చిత్రంలో బీరువా - ఎక్స్ప్రెస్ రాజా - జెంటిల్మన్ చిత్రాల కథానాయిక సురభి విష్ణు సరసన నటించనుంది. తమిళంలోనూ తెరకెక్కున్న సినిమా కావడంతో రెండు భాషలకూ తెలిసిన హీరోయిన్ని ఎంచుకున్నారు. సంగీత దర్శకుడిగా తమన్ ను పెట్టుకోవడంలో కూడా ఉద్దేశం అదే. విష్ణు సినిమాకు తొలిసారి తమన్ మ్యూజిక్ అందించబోతుండటం విశేషం.
ఇక విష్ణు లేటెస్ట్ మూవీ లక్కున్నోడు ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతాంజలి ఫేమ్ రాజా కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. విష్ణుకు కలిసొచ్చిన కామెడీ ఎంటర్టైనర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. దీని టీజర్.. ట్రైలర్ సినిమా మీద పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. విష్ణు లక్కీ హీరోయిన్ హన్సిక ఇందులో కథానాయికగా నటించింది.