తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఒక సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. తమిళ్ లో ఈ సినిమాకి 'అచ్చం ఎన్బదు మదమైద' అనే పేరును ఖరారు చేశారు. ఇక తెలుగులో ఏ పేరు పెడితే బాగుంటుందా అనే పరిశీలన కొనసాగుతోంది. ఈ సినిమాలో కథానాయికగా సమంతాను అవకాశం వెతుక్కుంటూ వెళ్లింది. అయితే వరుస సినిమాలు చేస్తోన్న సమంతా, దర్శకుడికి అవసరమైన సమయంలో తాను డేట్స్ ఇవ్వలేనని చెప్పిందట. దాంతో ఈ సినిమా కథకి తగిన నాయిక కోసం గౌతమ్ మీనన్ చేసిన అన్వేషణ ఫలించింది.
మలయాళ తెరపై కథానాయికగా రాణిస్తోన్న 'మంజిమ మోహన్' ని ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక చేశాడు. తమిళ్ వెర్షన్ లో కథానాయకుడిగా శింబు నటిస్తుండగా, తెలుగు వెర్షన్లో నాగచైతన్య కథానాయకుడు. ఈ రెండు భాషల్లోను మంజిమ మోహన్ కథానాయిక కావడం విశేషం. గౌతమ్ మీనన్ వంటి దర్శకుడి సినిమాలో .. అందునా రెండు భాషల్లో రూపొందుతోన్న సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టిందంటే మంజిమ మహా అదృష్టవంతురాలని అంతా అనుకుంటున్నారు.