మొదలైన రోజే రిలీజ్ డేట్ ప్రకటించే ఫిలిం మేకర్స్ అరుదుగా ఉంటారు. అందులోనూ టాలీవుడ్లో ఈ కల్చర్ బాగా తక్కువ. ఐతే రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వక్కంతం వంశీ మాత్రం ధైర్యంగా నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజవుతుందని దీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రం బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్లో వేసిన ఓ స్పెషల్ సెట్లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అల్లు అర్జున్కు సమ్మర్ సీజన్పై భలే గురి. కొన్నేళ్లుగా ప్రతి ఏటా వేసవికి తన సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. కొన్నేళ్ల కిందట రేసుగుర్రం తో సమ్మర్లో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. తర్వాతి ఏడాది వేసవిలో సన్నాఫ్ సత్యమూర్తి తో పలకరించాడు. అది కూడా ఓకే అనిపించింది. గత ఏడాది సరైనోడుతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బన్నీ లేటెస్ట్ మూవీ
దువ్వాడ జగన్నాథం కూడా వేసవికే రావాల్సింది. కానీ ఆలస్యమైంది.
ఈ సినిమా తేడా కొట్టేయడంతో సమ్మర్ సెంటిమెంటు మరింత బలపడినట్లుంది. అందుకే నా పేరు సూర్య’\ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వేసవికే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ ఏప్రిల్ 27 అంటున్నారు. కొంచెం అటు ఇటు అయినా కచ్చితంగా వేసవిలోనే సినిమాను రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న నా పేరు సూర్య కు నాగబాబు సమర్పకుడు కావడం విశేషం. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా నటించనుంది.