నయనతారకు విపరీతమైన క్రేజ్ మాత్రమే కాదు.. ఆమె సినిమాల ఎంపికపై జనాలకు ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అందుకే హీరోయిన్ ఓరియెంటెడ్ గా చేసిన సినిమాలకు కూడా.. స్టార్ హీరో చిత్రాలకు సమానంగా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. ఇక హిట్ టాక్ వచ్చిన తర్వాత అయితే.. వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా వచ్చిన ఆరామ్ మూవీ పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లా కలెక్టర్ పాత్రలో నయన్ నటనకు.. కోలీవుడ్ జనాలు ఫిదా అయిపోయారు.
సహజంగా సినిమా ప్రచారాలకు దూరంగా ఉంటుంది నయనతార. ఏమైందో తెలీదు కానీ.. ఆరామ్ కు హిట్ టాక్ వచ్చిన తర్వాత.. నయనతార తెగ ప్రమోషన్స్ చేసేస్తోంది. ఏకంగా చెన్నైలోని ఓ థియేటర్ కు కూడా వచ్చి.. అభిమానులతో ముచ్చట్లు పెట్టుకుంది. గతంలో ఎంతమంది అడిగినా.. తను ప్రచారం చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుందంటూ బెదరగొట్టిన ఈ భామ.. ఆరామ్ విషయంలో మాత్రం తన పంథా మార్చుకుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. మరి రాబోయే సంక్రాంతి సీజన్ కు బాలకృష్ణకు జోడీగా నయన్ నటించిన జైసింహా విడుదల కానుంది.
ఇప్పుడు కోలీవుడ్ మూవీ ఆరామ్ కు ప్రచారం చేసినట్లుగానే.. మరి పొంగల్ పండక్కి వచ్చే జై సింహకు కూడా నయనతార ప్రచారం చేస్తుందా.. ఇలా థియేటర్లకు వచ్చి పబ్లిసిటీ యాక్టివిటీస్ లో పాల్గొంటుందా అంటే మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం.