ధనుష్ పుట్టుకకు సంబంధించిన వివాదం కొత్త మలుపు తిరిగింది. మధురైకి చెందిన కదిరేశన్ దంపతులు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమంటున్న అతడు.. వాళ్లు డిమాండ్ చేస్తున్నట్లు డీఎన్ఏ టెస్టుకు ఒప్పుకోకపోవడం చర్చనీయంశమవుతోంది. తాను వాళ్ల కొడుకు కాదని బల్లగుద్ది వాదిస్తున్న ధనుష్.. డీఎన్ఏ టెస్టుకు మాత్రం ఒప్పుకోకపోవడం సందేహాలు రేకెత్తిస్తోంది. తాను కదిరేశన్ కొడుకు కాదని అంటున్నపుడు డీఎన్ఏ టెస్టుకు ఎందుకు భయపడుతున్నాడన్నది అర్థం కావడం లేదు. ఐతే ఈ విషయంలో ధనుష్ వాదన చిత్రంగా ఉంది.
ఈ వివాదం విషయంలో తాను ఏదీ దాయడం లేదని.. కానీ డీఎన్ఏ టెస్టుకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని ధనుష్ తేల్చి చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఇదేమీ క్రిమినల్ కేసు కాదని.. ఇలాంటి అర్థరహితమైన కేసు కోసం తాను డీఎన్ఏ టెస్టుకు సిద్ధపడనని.. అది తన ప్రైవసీకి భంగం కలించేదని.. డీఎన్ ఏ టెస్టుకు నిరాకరించడం తన హక్కు అని ధనుష్ కోర్టులో వాదించాడు. ధనుష్ ఇలా వాదించడంతో ఇప్పుడు అతడి మీదే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. తన వైపు తప్పులేనపుడు డీఎన్ఏ టెస్టుకు వెళ్తే నిజం నిగ్గు తేలుతుంది. కేసు కూడా తేలిపోతుంది. కానీ అతనందుకు అంగీకరించడం లేదు. ఈ కేసు విషయంలో తుది తీర్పును మద్రాస్ హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. ధనుష్ తమ కొడుకు కాదని ఒప్పుకోవడానికి అతడికి మనస్కరించడం లేదని.. ఆ విషయం అతను నోరు విప్పి ఖరాఖండిగా చెప్పేస్తే తాము ఈ పోరాటాన్ని ఆపేస్తామని చెప్పిన కదిరేశన్ దంపతులు ఇప్పుడేం చేస్తారో చూడాలి.