వరుసగా మూడు హిట్లు కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అందులోనూ లేటెస్ట్ మూవీ ?జనతా గ్యారేజ్? బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ సినిమా పూర్తి చేసి రెండు నెలలవుతున్నా కొత్త సినిమాను మొదలుపెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు తారక్. పరిస్థితి చూస్తుంటే ఇప్పుడిప్పుడే వేరే సినిమా మొదలయ్యే అవకాశాలు కూడా కనిపించట్లేదు. వక్కంతం వంశీ కథను పక్కనబెట్టేశాక చాలామంది దర్శకుల్ని ట్రై చేశాడు కానీ.. ఎవ్వరూ సెట్ కావట్లేదు.
ప్రస్తుతం తాను ఉన్న ఊపులో దర్శకులే తన దగ్గరికి రావాలి. కానీ ఎన్టీఆరే దర్శకులతో రాయబారాలు నడపాల్సి వస్తోంది. అతను ట్రై చేసిన దర్శకులందరూ వేరే వాళ్లకు కమిట్మెంట్లు ఇచ్చేయడంతో ఎన్టీఆర్ కు ఏం చేయాలో పాలు పోవట్లేదు. అలాగని ఎవరితోనో ఒకరితో లాగించేయాలని చూస్తే.. అసలుకే మోసం రావచ్చు. జాగ్రత్తగా ట్రాక్ లో పెట్టుకున్న కెరీర్ మళ్లీ దెబ్బ తినొచ్చు. ఈ నేపథ్యంలోనే దర్శకుల వెంట పడటం మానుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. గ్యాప్ వచ్చినా పర్వాలేదు తొందరపడకూడదని నిర్ణయించుకున్నాడట.
?జనతా గ్యారేజ్? సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా తర్వాతి సినిమాను పట్టాలెక్కించడం కోసం పడ్డ టెన్షన్ ఇక చాలంటూ ఇంకో రెండు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవడానికి ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ గ్యాప్ లో తన కొడుకు అభయ్ రామ్ తో ఫుల్ టైం ఎంజాయ్ చేయాలని.. కుటుంబానికి బాగా సమయం కేటాయించాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఈలోపు తాను ఇంతకుముందు అడిగిన దర్శకుల్లో ఎవరో ఒకరు ఖాళీ అవడమో.. ఇంకెవరైనా దర్శకుడు తనను సంప్రదించడమో జరుగుతుందని ఎన్టీఆర్ అనుకుంటున్నాడట.