చూడటానికి కుర్రాడు లేతగా కనిపిస్తాడు .. మనూళ్లోవాడిలా అనిపిస్తాడు .. యాక్టింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా నేచురల్ గా చేశాడని 'ముకుంద' సినిమా చూసినవాళ్లు అనుకున్నారు. అలాంటి కాంప్లిమెంటును అందుకున్న వరుణ్ తేజ్, మొదటి విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరింత కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకి రావడానికి అవసరమైన కసరత్తును చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ మాసంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం అందుతోంది.
ఈలోగా పూరీ జగన్నాథ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తాడట. ఇక క్రిష్ దర్శకత్వంలో వరుణ్ చేస్తోన్న సినిమాను పూర్తిచేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఆయన 'కంచె' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుని, పూరీ సినిమాకి సిద్ధమవుతాడట. హీరోయిజాన్ని తనదైన స్టైల్లో ఆవిష్కరించే పూరీ సినిమాతో, వరుణ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయమనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.