ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కు ఏ మాత్రం కొదువ లేదు. ఓ సినిమా హిట్ కొట్టడంలోనే కాదు.. ఫ్లాప్ కావడంలో కూడా సెంటిమెంట్లే కీలకమని నమ్మేస్తుంటారు. పైగా ఉన్నవి సరిపోవంటూ కొత్తవాటిని కూడా భలే వెతుక్కొంచుకుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ మూవీ ధృవ పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పుడు కొత్త సెంటిమెంట్ ఏంటంటే.. రామ్ చరణ్ కు అక్టోబర్ అచ్చిరాలేదంటున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు.. దగ్గరుండి మెగాభిమానులే తెగ ప్రచారం చేసేస్తున్నారు.
వీళ్లు చెబుతున్న రీజన్ ఏంటయ్యా అంటే.. గతేడాది అక్టోబర్ నెలలో బ్రూస్ లీ వచ్చింది. మెగాస్టార్ కేమియోతో రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటే.. తొలి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దసరా సీజన్ 42 కోట్లు వసూలు చేసింది కాబట్టి పరువు నిలబడింది కానీ.. లేకపోతే మెగాఫ్యాన్స్ బాధ మామూలుగా ఉండేది కాదు. అంతకు ముందు ఏడాది అక్టోబర్ లో గోవిందుడు అందరివాడేలే వచ్చింది. ఇది కూడా యావరేజ్ గానే ఆడింది. కలెక్షన్స్ కూడా అంతే. అందుకే అక్టోబర్ అంటేనే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ భయపడుతున్నారనే టాక్. ఇప్పుడు ధృవ చిత్రాన్ని కూడా అక్టోబర్ లో రిలీజ్ చేయాలనే ఆలోచన.. మెగా ఫ్యాన్స్ కి మింగుడుపడలేదు.
అసలు ఆగస్ట్ 12 అనుకున్న డేట్.. చెర్రీ చేసిన లేట్ కారణంగా వాయిదా పడింది. అయితే.. ఆ సీజన్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్న నిర్మాత అల్లు అరవింద్.. అటు సెంటిమెంట్ ని సెట్ చేసేస్తూ డెసిషన్ తీసుకున్నాడు. ఇటు ఫ్యాన్స్ ని శాటిస్ఫై చేసేలా.. అటు దసరా సీజన్ కలిసొచ్చేలా.. ''ధృవ'' సినిమాను సెప్టెంబర్ 30న రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.