డీజే ఆడియో లాంఛ్ ఈవెంట్.. మెగా ఫ్యాన్స్ కి బాగానే కిక్ ఇచ్చింది. కొత్త ట్రైలర్ లో దువ్వాడ జగన్నాధం అకట్టుకున్న తీరు.. హరీష్ శంకర్-బన్నీలు పవన్ నామ జపం చేయడం లాంటివి ఫ్యాన్స్ ని బాగానే ఎంటర్టెయిన్ చేశాయి. అయితే.. ఈ ఫంక్షన్ లో ఓ లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది.
ఏ మెగా హీరో సినిమా ఫంక్షన్ అయినా.. చిరంజీవి ఆశీర్వాదాలు ఇవ్వడం ఆనవాయితీ. చిరు నోటి వెంట సినిమా గురించి నాలుగు మాటలు విందామనే ఆసక్తి మెగాభిమానుల్లో ఎక్కువగానే ఉంటుంది. అయితే.. డీజే ఆడియో వేడుకకు మెగాస్టార్ మిస్ అయ్యారు. అసలు బన్నీ సినిమా ఫంక్షన్ ను చిరు మిస్ చేయడం అనే కాన్సెప్ట్ చాలా మందికి అర్ధం కాలేదు. నిజానికి దాసరి మృతికి సంతాప సూచకంగానే చిరంజీవి ఈ వేడుకకు రాలేదని తెలుస్తోంది. దాసరి మరణించినపుడు చిరు చైనాలో ఉన్నారు. అక్కడి నుంచే తన నివాళులు తెలిపారు. రీసెంట్ గా దాసరి సంతాప సభలో కూడా పాల్గొన్నారు చిరంజీవి.
ఆ వెంటనే కొన్ని రోజుల్లోనే జరుగుతున్న వేడుక కావడంతో.. డీజే ఆడియో లాంఛ్ కు రాకూడదని.. ఆఖరి నిమిషంలో నిర్ణయించారట చిరు. అయితే.. ఈ నెల 18న జరిగే డీజే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం మెగాస్టార్ తప్పకుండా హాజరు అవుతారని తెలుస్తోంది.