వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ ట్వీట్లు చేసేసే విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై మహా ఎటకారపు ట్వీట్ చేసేశారు. పీకే ఫ్యాన్సే కాదు.. పీకేకు సైతం ఒళ్లు మండేలా వ్యాఖ్య చేసిన వర్మ.. ట్వీట్ రచ్చ రచ్చ ఖాయమన్న మాట వినిపిస్తోంది. గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ.. వర్మ తాజాగా ట్వీట్ చేశారు.
తనకు మొక్కలంటే ప్రేమ అని.. పొలంలో గులాబీ కొమ్మ పాలిపోతే.. ఎందుకు ఎండిపోతున్నావు రా.. అంత కష్టం ఏం వచ్చిందని నిమిరా.. రెండు రోజుల్లో కొమ్మకు కొత్త జీవం వచ్చిందని చెప్పిన పవన్ మాటలతో పాటు.. గతంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఇదే తరహా ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. దాన్ని కూడా ప్రస్తావించారు వర్మ.
అదిలాబాద్లోని ఒక మారుమూల గ్రామానికి వెళ్లాం. తీవ్ర కరవు. పాతాళం వరకూ తవ్వినా నీళ్లు పడలేదు. ఓ చోట అడుగు పెట్టిన వెంటనే గలగలా అన్నసవ్వడి వినిపించింది. మా వాళ్లను తవ్వమన్నా.. నీళ్లు పడ్డాయి(వాస్తవానికి ఈ విషయాన్ని పవన్ మరీ ఇంత డ్రమటిక్ గా చెప్పలేదు. కాకుంటే.. అటూఇటూగా విషయం ఇదే. కానీ.. పవన్ చెప్పిన మాటల్ని కాస్తంత డ్రమటైజ్ చేసి వర్మ పోస్ట్ గా పెట్టారు) అన్న వ్యాఖ్యల్ని ఫోటోగా పెట్టేసిన వర్మ.. దానిపైన తనదైన శైలిలో కామెంట్ పెట్టేశారు.