నలుగురు హీరోల మల్టీ స్టారర్ అనే కాని.. నలుగురూ అస్సలు హిట్లే లేని హీరోలు. ఈ మధ్య కాలంలో ఏదో పర్లేదు అనిపించుకోవడమే కాని.. చేతిలో హిట్లు పడితే మాత్రం ఒట్టు. అలాంటప్పుడు వాళ్ళ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి? చాలా ఎగ్రసివ్ గా రెచ్చిపోవాలి. కాని ఇప్పుడు సందీప్ కిషన్ - ఆది - నారా రోహిత్ - సుధీర్ బాబు కలిసి నటించిన శమంతకమణి చిత్రం విడుదల అవుతుంటే.. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో పెద్దగా బజ్ లేదంటున్నారు ట్రేడ్ వర్గాలు.
శమంతకమణి ట్రైలర్ ఆసక్తి రేకెత్తించిన మాట వాస్తవం. కాకపోతే ఎన్నారై ఆడియన్స్ మాత్రం ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలో హాలీవుడ్ లో చాలానే చూశారట. ది ట్రాన్స్పోర్టర్ నుండి మొదలుపెట్టి.. ఇప్పుడు ఇలా ఒక కార్ బ్యాక్ డ్రాపులో చాలా సినిమాలే వచ్చాయి. పైగా నలుగురూ ఆ వస్తువే (ఇక్కడ కారు) కావాలని అనుకోవడం.. దాని కోసం కొట్టుకోవడం.. కన్ఫ్యూజన్ కామెడీ.. ఇవన్నీ హాలీవుడ్లో చాలా సినిమాల్లో వచ్చేశాయి. అందుకే ఎన్నారై ఆడియన్స్ కు సినిమా ట్రైలర్ అంతగా ఎక్కలేదని అంటున్నారు. అందుకే బజ్ రావట్లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రేపే శమంతకమణి చిత్రం విడుదల అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో.. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్టయితే.. ఒకేసారి ఐదుగురికి పెద్ద హిట్టు పడినట్లే. నలుగురు హీరోలతో పాటు.. కంపోజర్ మణిశర్మ కు కూడా హిట్టు కావాలి మాష్టారూ.