శర్వా ఒకటికి రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో ఒకటి స్వామిరారా.. కేశవ చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మతో కాగా.. ఇంకోటి రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడితో చేయబోయేది. ఇందులో ముందుగా సుధీర్ సినిమా మొదలవుతుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఖరారయ్యాడు. హారిక-హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇక్కడో ఓ ఆసక్తికర విషయం ప్రస్తావించాలి.
రాధాకృష్ణ ఇప్పటిదాకా నిర్మించిన సినిమాలన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలోనే కావడం విశేషం. తొలి సినిమా జులాయి.. రెండో సినిమా సన్నాఫ్ సత్యమూర్తి.. మూడో సినిమా అఆ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా.. మొత్తంగా నాలుగూ త్రివిక్రమే డైరెక్ట్ చేశాడు. తొలిసారిగా త్రివిక్రమ్ కాకుండా రాధాకృష్ణ సినిమా నిర్మించబోయేది సుధీర్ దర్శకత్వంలోనే. రాధాకృష్ణ హారిక హాసిని తో పాటుగా సితార ఎంటర్టైన్మెంట్స్ అనే బేనర్ కూడా ఒకటి పెట్టారు. ఆ బేనర్లో ప్రేమమ్.. బాబు బంగారం లాంటి సినిమాలొచ్చాయి. వాటిని వేరే దర్శకులతో నిర్మించారు. వాటికి నిర్మాత సూర్యదేవర నాగ వంశీ. ఐతే హారిక హాసిని బేనర్లో త్రివిక్రమ్ కాకుండా పని చేయబోతున్న తొలి దర్శకుడు సుధీర్ కాబోతున్నాడు.