మహేష్ బాబు కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించనున్న 'బ్రహ్మోత్సవం' సినిమాలో అనేక విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో గాయని సునీత ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సునీతను ఈ పాత్ర విషయమై సంప్రదించారట. పాత్ర తీరుతెన్నులు తనకి నచ్చడం వలన, ఇది కుటుంబ నేపథ్యంతో కొనసాగే కథ కావడం వలన ఆమె ఈ సినిమాను అంగీకరించిందని అంటున్నారు. ఇక నటిగా తన తొలి సినిమా మహేష్ బాబు కాంబినేషన్ లోది కావడం కూడా ఆమె ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగుపాటకి మరింత తీయదనాన్ని తెచ్చిన గాయనిగా సునీత అనతికాలంలోనే ఎంతో పాప్యులర్ అయింది. ఒకవైపున పాటలు పాడుతూనే, మరోవైపున కొత్త కథానాయికలకు గాత్రదానం చేసింది. ఈ రంగంలో కూడా ఆమె చాలా వేగంగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. సహజంగానే తేనెలొలుకు తెలుగుపాటకి రూపం వచ్చినట్టుగా కనిపించే సునీతకు, సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆమె వాటిపట్ల అంతగా ఆసక్తి చూపలేదు. ఇప్పడు 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటించడానికి ఆమె సంసిద్ధతను వ్యక్తం చేసిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. అదే నిజమైతే నటిగా కూడా ఈ అందాల కోయిలమ్మ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.