చిత్రపరిశ్రమలో కొన్ని స్నేహాలు బలంగా కనిపిస్తూ వుంటాయి. ఆ స్నేహం కోసం వాళ్లు తమ కెరియర్ గురించి కూడా ఆలోచించకుండా చిన్నపాత్రలు చేసిన సందర్భాలు కనిపిస్తూ వుంటాయి. అలా తన స్నేహితుడి కోసం తాను అలాంటి అతిథి పాత్రల్లో సైతం నటించడానికి సిద్ధంగా ఉంటానని టబూ చెబుతోంది. హీరో అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'దృశ్యం' హిందీ రీమేక్ లో ఆమె పోలీస్ కమిషనర్ గా కనిపిస్తుంది.
ఈ సినిమా గురించి మాట్లాడే సమయంలోనే ఆమె తనకి అజయ్ దేవగణ్ తో గల పరిచయాన్ని గుర్తు చేసుకుంది. అతను .. తాను చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులని చెప్పింది. ఇద్దరం కలిసి పెరిగామనీ .. తమ కాంబినేషన్లో వచ్చిన 'విజయ్ పథ్' ఘనవిజయాన్ని సాధించిందని అంది. ఆయన సినిమాలో అతిథి పాత్రైనా చేస్తాననీ, తమ మధ్యగల స్నేహం అలాంటిదని చెప్పుకొచ్చింది.