చిరంజీవి ఇంట్లో నుంచి దాదాపు రూ. 16 లక్షల నగదు దొంగతనానికి గురైన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో పని మనిషి చెన్నయ్య ఈ దొంగతనం చేశాడని బుధవారం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ రోజు నిందితుడు చెన్నయ్యను పోలీసులు మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఆ ఇంట్లో 10 సంవత్సరాలుగా పని చేస్తున్న చెన్నయ్య ఈ దొంగతనానికి పాల్పడ్డాడని ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.1.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కర్నూలు జిల్లాకు చెందిన చెన్నయ్య దాదాపు 10 సంవత్సరాలుగా చిరంజీవి ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ బోరబండ సమీపంలో నివసిస్తున్నాడు.
చిరంజీవి ఆఫీసులో మేనేజర్ గంగాధర్...రూ.4 లక్షల రూపాయలను ఉంచడాన్ని చెన్నయ్య గమనించాడని ఎవరూ లేని సమయంలో అందులో నుంచి రూ. 2 లక్షలు దొంగిలించాడడు. చెన్నయ్యపై అనుమానం రావడంతో గంగాధర్ జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారమిచ్చాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు చెన్నయ్యను అరెస్టుచేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో చెన్నయ్య దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. గత రెండు నెలల కాలంలో చెన్నయ్య దాదాపు రూ.16 లక్షల డబ్బును దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు.