విక్టరీ వెంకటేష్ లో ఆధ్యాత్మిక కోణం గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా.. ఎక్కడో ఓ చోట ఆధ్యాత్మిక అంశాల ప్రస్తావన ఉంటుంది. ఆ ప్రస్తావన వచ్చిందంటే.. ఇక వెంకీ మరోలా కనిపిస్తాడు. ఓవైపు స్టార్ హీరోగా కొనసాగుతూ.. స్పిరుచువాలిటీ గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అందరికీ. ఇంతకీ వెంకీలో ఈ మార్పు ఎలా మొదలైంది.. ఆయన ఆధ్యాత్మికత వైపు ఎందుకు నడిచారు.. ఈ విషయాల్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పంచుకున్నాడు వెంకీ.
‘‘అవి ‘ప్రేమించుకుందాం రా’ సెన్సేషనల్ హిట్టయిన రోజులు. సినిమా మేం ఊహించని స్థాయిలో విజయవంతమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ టూర్లు చేశాం. చాలా చోట్ల తిరిగాం. జనాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మాకు బ్రహ్మరథం పట్టారు. మేం చివరగా వెళ్లిన చోట కూడా జనాలు భారీగా వచ్చారు. చాలా సందడి చేశారు. కానీ ఉన్నట్లుండి నాలో ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. నిజానికి నేనక్కడ చాలా సంతోషంగా ఉండాలి. కానీ నాకా సంతోషం కనిపించలేదు. చాలా అసంతృప్తిగా అనిపించింది. అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అప్పుడే నాలో అంతర్మథనం మొదలైంది. తర్వాత రమణ మహర్షి పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అప్పుడే మనం జీవించే జీవితం జీవితం కాదని అర్థమైంది. మనం మనం కాదని.. మనలోన ఇంకొకడు ఉంటాడని అనిపించింది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది. నేను జీవితాన్ని చూసే కోణం మారింది. నా జీవన శైలీ మారింది. అప్పుడప్పుడూ ఒక్కడినే ఉన్నట్లుండి హిమాలయాలకు వెళ్లిపోతుంటా. ఇక్కడ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగుతుంటా.