కళ్లు పెట్టి చూస్తూ చెప్పుకునే మూగబాసలు.. గుండె గదిలో గూడు కట్టుకుని ఉండే భావాలు.. అంటీ అంటని అధర చుంబనాలు.. చెలి కౌగిలిపై పేజీల కొద్దీ కవితలు.. ఇలాంటి సెన్సిబుల్ రొమాంటిక్ సీన్లన్నంటినీ బ్రేక్ చేసిన చిత్రం అర్జున్ రెడ్డి. ప్రేమైనా.. కోరికైనా పచ్చిగా వ్యక్తపరిచే అర్జున్ రెడ్డి ఒక ఎక్స్ ట్రీమ్ క్యారెక్టర్ తో ప్రేక్షకులపై ఓ చెరగని ముద్ర వేశాడు హీరో విజయ్ దేవరకొండ.
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ యూత్ లో పాపులారిటీ బాగా పెరిగిపోయింది. దీంతో దీని తర్వాత కూడా యూత్ కు నచ్చే లవ్ స్టోరీసే చేయడానికి డిసైడయ్యాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టెయినర్ చేయడానికి విజయ్ దేవరకొండ అంగీకరించాడనే విషయం టాలీవుడ్ లో పలువురిని ఆశ్చర్య పరిచింది. వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. క్రాంతి మాధవ్ తో ఇంతకుముందు మళ్లీమళ్లీ ఇదిరాని రోజు వంటి ఫీల్ గుడ్ ఫిలిం తీసిన క్రియేటివ్ కమర్షియల్స్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను సైతం నిర్మిస్తోంది.
బేసిగ్గా క్రాంతిమాధవ్ టేకింగ్ అంతా స్మూత్ అండ్ పొయిటిక్ గా ఉంటుంది. లేటెస్ట్ గా వచ్చిన ఉంగరాల రాంబాబును పక్కన పెట్టేస్తే అతడు ఇంతకుముందు తీసిన మళ్లీమళ్లీ ఇది రాని రోజు మూవీ చూస్తే లవ్ స్టోరీ ఎంత హృద్యంగా చెప్పగలడో తెలుస్తుంది.