కొత్త దర్శకులతో ప్రయోగం చేసేందుకు అందరూ సాహసించరు. అల్లు అర్జున్ ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేవాడు. కానీ కొంతకాలంగా బన్నీ యాటిట్యూడ్ లో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు ఈ స్టైలిష్ స్టార్. స్టార్ రైటర్ గా వక్కంతం వంశీ అందరికీ పరిచితుడే అయినా.. పలు బ్లాక్ బస్టర్స్ కు కథ అందించినా.. దర్శకుడిగా అవకాశం ఇచ్చేందుకు చాలామంది సంశయించారు. కానీ బన్నీ మాత్రం నా పేరు సూర్య చిత్రానికి డైరెక్షన్ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడికి కూడా అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సంతోష్ రెడ్డి అనే ఔత్సాహిక దర్శకుడు చెప్పిన కథ.. బన్నీకి ఫుల్లుగా నచ్చేసిందిట. కేవలం ఒకే సిటింగ్ లోనే సినిమా తెరకెక్కించేందుకు కూడా యాక్సెప్ట్ చేసేశాడట అల్లు అర్జున్. స్క్రిప్ట్ కూడా దాదాపుగా ప్రిపేర్డ్ గా ఉండడంతో.. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెడదామని బన్నీ చెప్పినట్లుగా తెలుస్తోంది.
నా పేరు సూర్య చిత్రం తర్వాత సంతోష్ రెడ్డి సినిమానే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే.. యూవీ క్రియేషన్స్ కి సన్నిహితుడు ఈ సంతోష్ రెడ్డి. దీంతో అల్లు అర్జున్- సంతోష్ రెడ్డి కాంబోలో రూపొందబోయే చిత్రానికి నిర్మాతలు ఎవరనే అంశం ఇంకా తేలలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
వరుసగా రెండో చిత్రం కూడా కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తూ.. అల్లు అర్జున్ పెద్ద రిస్క్ చేయడానికి సిద్ధపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.