కొనుగోలు విషయమై పన్ను ఎగ్గొట్టిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీనటి అమలాపాల్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆమెపై ఆరోపణలు సంధిస్తూ కథనం ప్రచురించిన మీడియా సంస్థపై అమలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పన్నుకట్టలేదన్న మాటను ఖండించటమే కాదు.. ఒక ప్రకటనతో సదరు సంస్థపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తాను భారతీయురాలినని.. ఎక్కడికైనా వెళతాను.. ఏమైనా కొంటానని తేగేసి చెప్పారీ కేరళ బ్యూటీ. తనపై పన్ను ఎగ్గొట్టినట్లు వార్త ప్రచురించిన మలయాళ దినపత్రిక మాతృభూమిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక దినపత్రిక తన సర్క్యులేషన్ పెంచుకోవటానికి ఇలాంటి చౌకబారు విధానాల్ని అనుచరించటం తీవ్ర షాక్ కు గురైనట్లు ఆమె పేర్కొన్నారు.
మాతృభూమి పేరు పెట్టుకొన్న సదరు పత్రిక జాతి సమైక్యతను దెబ్బ తీసేలా కథనాలు ప్రచురించటం దురదృష్టకరమని.. చట్టాన్ని గౌరవించే భారతీయ పౌరురాలిగా తాను ఏడాదికి కోటి రూపాయిలకు పైగా పన్ను చెల్లించానని చెప్పారు. సదరు పత్రిక తనపై ఆరోపణలు చేసినట్లుగా తాను ఎలాంటి తప్పు చేయలేదని అధికారులు గుర్తించినట్లుగా ఆమె పేర్కొన్నారు. కావాలనే తనపైనా.. తన కుటుంబం పైనా బురద జల్లుతున్నారన్నారు.
కేరళకు చెందిన అమలాపాల్ ఖరీదైన కారును పుదుచ్చేరిలో కొన్నారు. ఆ కారును అక్కడ రిజిష్టర్ చేయటం కారణంగా దాదాపు రూ.20లక్షల మేర పన్ను ఎగ్గొట్టినట్లుగా అమలాపాల్ మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే.. తాను ఏడాదికి ఎంత పన్నుకడుతున్న విషయాన్ని చెప్పిన అమలాపాల్.. కారుకు సంబంధించి తాను చెల్లించిన పన్ను రశీదుల వివరాల్ని కూడా ప్రకటనతో పాటు పంపి ఉంటే మరింత బాగుండేది. అసలు విషయాన్ని వదిలేసి.. కొసరు విషయాలన్నట్లుగా మాట్లాడటం గమనార్హం.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే కరెన్సీ చలామణీలో ఉందని.. జీఎస్టీ కూడా అమల్లోకి వచ్చిందని.. ఆ విషయం మరిచిన వారికి గుణపాఠం చెప్పాలన్నారు. తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయటానికి.. బెంగళూరులో ఆస్తులు కొనటానికి వీరి అనుమతి తీసుకోవాలా? అంటూ పత్రికను ఉద్దేశించి ఫైర్ అయ్యారు.