సినీ హీరోలను డెమీ గాడ్స్ గా ఆరాధించే అభిమానులున్నారు. అందులోనూ తమిళ చిత్ర పరిశ్రమలో హీరోలకు హీరోయిన్లకు ఏకంగా గుడులు కట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మంది స్టార్ హీరోలకు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. తమ అభిమాన హీరో చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు థియోటర్ల దగ్గర చేసే హడావిడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అయితే తమ హీరోలకు మద్దతుగా విపరీతమైన పోస్టింగ్స్ పెడుతుంటారు. ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్ కు మధ్య కామెంట్ల వార్ లు నిత్యం జరుగుతుంటాయి. అటువంటి అభిమానులకు కొంతమంది హీరోలు టచ్ లో ఉంటారు.
కానీ తాను మాత్రం అభిమానులను దూరంగా పెడతానని తమిళ హీరో అరవింద స్వామి అంటున్నాడు. అభిమానులతో టచ్ లో ఉండడం వంటి విషయాలకు తాను పూర్తి భిన్నమని అరవింద్ స్వామి చెప్పాడు.రోజా .. బొంబాయి సినిమాల సమయంలో అరవింద్ స్వామికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. చాలామంది అభిమానులు అరవింద స్వామిని చూడటానికి మాట్లాడటానికి ఎగబడేవారు. ఆ సమయంలో జరిగిన ఓ ఘటన అరవింద స్వామిని కలచి వేసిందట.
రోజా సినిమా సమయంలో ఒక టీనేజ్ అమ్మాయి రక్తంతో ఆయనకు లెటర్ రాసిందట. ఆ పని అరవింద స్వామికి నచ్చలేదు. దీంతో అసహనానికి లోనైన అరవింద్ స్వామి ...ఇటువంటటి పనులతో సమయాన్ని వృథా చేసుకోవద్దనీ .. చదువుకుని వృద్ధిలోకి రమ్మని చెబుతూ అభిమానులకు సమాధానమిచ్చాడట. ఆ రోజు నుంచి అభిమానులను తాను ప్రోత్సహించదలచుకోలేదనీ దగ్గరికి రానిస్తే వాళ్ల భవిష్యత్ పాడైపోతుందని భావించి దూరంగానే ఉంచుతూ వచ్చానని చెప్పాడు ఈ వెటరన్ హీరో.