ఇండియా-రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 7 దశాబ్దాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల అనుబంధానికి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 39వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో తొలిసారిగా భారతీయ చిత్రాలను ప్రదర్శించాలని నిర్ణయించారు. ఇందులో బాహుబలి మూవీ కూడా ఉండడం విశేషం.
మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో.. భారతీయ సినిమా అడుగులను మార్చివేసిన చిత్రాలను ప్రదర్శించబోతున్నారు. బాహుబలి సిరీస్ తో పాటు.. బ్యాడ్ మ్యాన్.. ఎ డెత్ ఇన్ ద గంజ్.. బేయార్.. యూ టర్న్.. కోతనోడి.. చిత్రాలను ఇక్కడ ప్రదర్శించనుండడం విశేషం. 70 వసంతాల అనుబంధాన్ని వేడుకలా నిర్వహించుకుంటున్నా.. ఇది ఇండియా-రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మించిన వేడుక అని రష్యా ఎంబసీ వర్గాలు అంటున్నాయి.
రష్యన్ ఫెడరేషన్ కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ చలన చిత్రోత్సవాన్ని నిర్వహించనుంది. జూన్ 22-29 మధ్య జరగనున్న ఈ వేడుకలో.. మొదటగా బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ నటించిన మాక్యుమెంటరీ బ్యాడ్ మ్యాన్ ను ప్రదర్శించనున్నారు. ఇండియన్ ఫిలిం మేకర్స్ క్రియేటివిటీని చూసేందుకు రష్యా ప్రేక్షకులకు ఇదో అద్భుతమైన అవకాశంగా చెబుతున్నారు.