హైదరాబాద్: సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై అంతటా పరిస్దితి ఎలా ఉంది, బాలయ్య ఎలా ఉన్నారు అంటూ మీడియా సంస్దలకు ఫోన్ కాల్స్ ,సోషల్ మీడియాలో పోస్ట్ లు రావటం మొదలయ్యాయి. దాంతో బాలయ్య వెంటనే స్పందించి మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడుతూ.... యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా.. పూలమాల వచ్చి అద్దం మీద పడడంతో.. రోడ్డు సరిగా కనిపించక డివైడర్ను గుద్దానని, కారు టైరు బ్లాస్ట్ అవ్వడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు.
అలాగే తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని బాలకృష్ణ పేర్కొన్నారు. యాక్సిడెంట్ వివరాల్లోకి వెళితే..హీరో బాలకృష్ణ కార్ ప్రమాదానికి గురైంది. హిందూపురం నుండి బెంగుళూరుకు వెళుతున్న బాలకృష్ణ కార్ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది. కార్ టైర్స్ బరస్ట్ అవ్వడంతో అదుపుతప్పిన కార్ పక్కనే ఉన్న డివైడర్స్ ను ఢీ కొట్టి ఆగింది..లేకపోతే పెను ప్రమాదమే జరిగి ఉండేది. అయితే ఈ సమయంలో బాలకృష్ణ స్వయంగా కార్ డ్రైవ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు.