యుద్ధం శరణం.. మేడ మీద అబ్బాయి.. సెప్టెంబరు తొలి రెండు వారాల్లో విడుదలైన సినిమాలివి. వీటిలో ఏదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. ఒకదాన్ని మించి ఒకటి నిరాశకు గురి చేశాయి. దారుణమైన ఫలితాలనందుకున్నాయి. ఈ వారం కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఒకటికి ఐదు సినిమాలు రిలీజయ్యాయి కానీ.. ఏవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేదు.
ఉంగరాల రాంబాబు.. కథలో రాజకుమారి.. శ్రీవల్లీ.. ఈ మూడు సినిమాలకూ పాజిటివ్ టాక్ రాలేదు. వీడెవడు పర్వాలేదంటున్నా.. ఈ సినిమాకు హీరో సచిన్ జోషి కావడం ప్రతికూలమైంది. శింబు సినిమా సరసుడు గురించి డిస్కషనే లేదసలు. మొత్తానికి ఈ వారం ఒకటికి ఐదు సినిమాలు రిలీజైనా.. బాక్సాఫీస్ లో కళ కనిపించట్లేదు. ఎన్టీఆర్ సినిమా ‘జై లవకుశ’ విడుదలయ్యే ముందు గ్రౌండ్ క్లియర్ అయినట్లుగా ఉంది పరిస్థితి చూస్తుంటే.
ఆ సినిమా మీద మరింత అంచనాలు.. ఆశలు పెరిగేలా చేశాయి ఈ వారం సినిమాలు. ఈ వారం సినిమాలు వీకెండ్లోనూ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టంగా ఉండగా.. వీకెండ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముందు వారాల్లో వచ్చిన సినిమాలు కూడా తేలిపోయిన నేపథ్యంలో ప్రేక్షకుల ఆకలి తీర్చాల్సిన బాధ్యత ముందుగా జై లవకుశ మీదే ఉంది.