విడుదలకు ముందు.. విడుదలైన కొన్ని రోజుల వరకు దర్శకులు తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఐతే థియేట్రికల్ రన్ పూర్తయ్యాక మాత్రం మాటలు మారుతుంటాయి. కొంచెం వాస్తవంలోకి వచ్చి.. తమ సినిమాలకు సంబంధించిన నిజాలు ఒప్పుకుంటారు. హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు. ?జనతా గ్యారేజ్? గురించి కొరటాల ఎంత గొప్పగా చెప్పుకున్నాడో అందరికీ తెలిసిందే. సినిమాకు ఆరంభంలో డివైడ్ టాక్ రావడంపైనా కొరటాల అసహనంగా మాట్లాడాడు. సమీక్షల మీద.. ఈ సినిమా గురించి నెగెటివ్ కామెంట్లు చేసిన వాళ్ల మీద విమర్శలు గుప్పించాడు. ఐతే ఆ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడుతున్నాడు.
జనతా గ్యారేజ్ సినిమాలో లోపాలు ఉన్నాయన్నది కొరటాల తాజా మాట. తనకు సంబంధం లేని మరో సినిమా గురించి చెబుతూ.. కొరటాల ఈ వ్యాఖ్యలు చేశాడు. తాను తీసిన ?జనతా గ్యారేజ్?లో లోపాలు ఉన్నాయని.. కానీ ఈ శుక్రవారం విడుదల కాబోయే జయమ్ము నిశ్చయమ్మురా అలాంటి లోపాలేమీ లేకుండా తెరకెక్కిన పర్ఫెక్ట్ సినిమా అని కితాబిచ్చాడు కొరటాల. ఒక మంచి సినిమా తెరకెక్కాలంటే అన్ని విభాగాలు.. అన్ని పాత్రలూ పర్ఫెక్టుగా కుదరాలని.. జనతా గ్యారేజ్ విషయంలో అలా జరగలేదని.. జయమ్ము నిశ్చయమ్మురా విషయంలో అలా అన్నీ కుదరడం సంతోషంగా ఉందని కొరటాల వ్యాఖ్యానించాడు. మరి ఇప్పుడు తనే స్వయంగా జనతా గ్యారేజ్ లో లోపాలున్నాయని ఒప్పుకుంటున్నపుడు.. సినిమా రిలీజ్ సందర్భంగా అందులోని లోపాల్ని క్రిటిక్స్ ఎత్తి చూపినపుడు మాత్రం ఎందుకంత కోపం వచ్చిందన్నదే అర్థం కాని విషయం.