గోవిందుడు అందరివాడే సినిమా అంతగా ఆడకపోయినా.. కృష్ణవంశీ గత సినిమాల్లాగా డిజాస్టర్ కాలేదు. దీంతో ఆయన కొంచెం కోలుకుని సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం అనే క్రేజీ ప్రాజెక్టును లైన్లో పెట్టాడు. ఆరంభం నుంచి ఈ సినిమా ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. ఒక టైంలో వరుసగా ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ.. ప్రమోషన్ విభిన్నంగా చేస్తూ సినిమాను బాగానే వార్తల్లో నిలిపాడు కృష్ణవంశీ. కానీ మూడు నెలల నుంచి ఈ సినిమా గురించి అప్ డేట్ లేదు. నెమ్మదిగా ఈ చిత్రం వార్తల నుంచి పక్కకు వెళ్లిపోయింది. గత ఏడాది ఆఖర్లోనే వస్తుందనుకున్న సినిమా.. ఇప్పుడిప్పుడే విడుదలయ్యేలాగా కనిపించట్లేదు. ఆర్థిక ఇబ్బందులే ఈ సినిమా ఇలా ఆలస్యం కావడానికి కారణమన్న టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం.
నక్షత్రం నిర్మాతలు విజయ్ ఆంటోనీ మూవీ బేతాళుడు మీద పెట్టుబడి పెట్టారు. కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ ప్రభావం నక్షత్రం మీద పడింది. ఫైనాన్స్ సరైన సమయానికి అందకపోవడంతో షూటింగ్ పెండింగులో పడిపోయిందట. మరోవైపు ఈ సినిమా మీద ట్రేడ్లో నెమ్మదిగా క్రేజ్ తగ్గిపోతోంది. సందీప్ కిషన్ ఫాంలో లేకపోవడంతో కూడా సినిమాకు ప్రతికూలంగా మారుతోంది. సినిమా మీద హైప్ ఉన్న టైంలోనే చకచకా విడుదలకు సిద్ధం చేస్తే పరిస్థితి మరోలా ఉండేది. ఇది కూడా పైసా లాగా డిలే అయిపోతుందేమో అని కృష్ణవంశీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో రైతు కూడా డైలమాలో పడ్డ నేపథ్యంలో నక్షత్రం వీలైనంత త్వరగా బయటికి రాకపోతే కృష్ణవంశీ కెరీర్ ప్రమాదంలో పడటం ఖాయం.