భక్తకన్నప్ప రీమేక్.. దీని గురించి చాలా ఏళ్లుగా టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ముందు కృష్ణం రాజు ప్రభాస్ హీరోగా ఈ సినిమా తీయాలనుకున్నారు. ఆ తర్వాత తనికెళ్ల భరణి తెరమీదికి వచ్చారు. మంచు విష్ణు హీరోగా ఆయన ఈ సినిమా తీయాలని సంకల్పించారు. కానీ తర్వాత దీని గురించి చర్చ లేదు. ఐతే మంచు విష్ణు ఈ సినిమాను కన్ఫమ్ చేశాడు. తాను కథానాయకుడిగా ఈ సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.45 కోట్లని విష్ణు చెప్పడం విశేషం. తనకు అంత మార్కెట్ లేకపోయినప్పటికీ.. ఈ కథ మీద ఉన్న నమ్మకంతో అంత భారీ బడ్జెట్లో సినిమా చేయడానికి సిద్ధపడినట్లు విష్ణు వెల్లడించాడు.
నిజానికి హీరో మార్కెట్ ను బట్టే సినిమా మీద ఖర్చు పెట్టాలి. నా చివరి సినిమా 20 కోట్లు వసూలు చేస్తే.. కొత్త సినిమాకి అంత బడ్జెట్ కాకుండా 15 కోట్లలో తీసి సినిమాకు లాభం వచ్చేలా చూసుకోవాలి. 20 కోట్లు వచ్చాయని 30 కోట్లు పెట్టి సినిమా తీయాలనుకోకూడదు. కథ విన్నప్పుడే బడ్జెట్ ఎంతనే అవగాహన వచ్చేస్తుంది. కొన్ని సినిమాలకు మాత్రం ఈ లెక్కలు వేయకూడదు. భక్త కన్నప్పకి మేం అనుకున్న బడ్జెట్ 45 కోట్లు. ఇప్పుడు నా మార్కెట్ వాల్యూ అంత లేదు. కానీ ఆ కథపై నాకంత నమ్మకం ఉంది. ఈ సినిమా ప్రస్తుతం స్టోరీ బోర్డ్ దశలో ఉంది. తనికెళ్ల భరణి గారు కథ మాత్రమే ఇస్తున్నారు. దర్శకత్వం చేయట్లేదు?? అని విష్ణు తెలిపాడు