సినిమాలు చేయడం తన అదృష్టం అంటోంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. తనకు తెలుగులో ఇంత మంచి లాంచింగ్ దక్కుతుందని తాను ఊహించలేదని.. తెలుగు సినిమాల్లో నటిస్తున్నానని తాను ఎవరికైనా గర్వంగా చెప్పుకుంటానని ఆమె అంది. ప్రస్తుతం ఇండియాలో తెలుగు సినిమానే నెంబర్ వన్ అని.. అలాంటి ఇండస్ట్రీలో తనకు కథానాయికగా అవకాశాలు దక్కడం అదృష్టమని ఆమె అంది.
మెహ్రీన్ ఇప్పటికే ఫిల్లౌరి అనే హిందీ సినిమాలో నటించింది. మరి మళ్లీ ఎప్పుడూ బాలీవుడ్లో నటిస్తారు అని అడిగితే.. ఇప్పటికైతే తనకు వేరే ఇండస్ట్రీలపై దృష్టి లేదని.. తెలుగులోనే నటిస్తానని ఆమె అంది. అసలు బాలీవుడ్.. టాలీవుడ్ అని వేరు చేయడం కరెక్ట్ కాదని.. ఇండియన్ సినిమా అని పిలవాలని మెహ్రీన్ చెప్పింది.
తన కొత్త సినిమా జవాన్ గురించి చెబుతూ.. ఇందులో నేను భార్గవి అనే పాత్ర చేస్తున్నా. ఆధునిక భావాలున్న అమ్మాయి తను. ఆమె ఒక పెయింటర్. ఈ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. నా తొలి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథ రిలీజైన రెండో రోజుకే ఈ సినిమాకు సంతకం పెట్టాను. అప్పటికి నాకు ఈ సినిమా కథ కూడా తెలియదు. డైరెక్టర్ బీవీఎస్ రవి నన్ను నమ్మారు.