అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ రా రండోయ్ వేడుక చూద్దాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేశారు. రోజూ ఎడిటింగ్ రూమ్ లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కలిసి కూర్చుంటున్నానని చెప్పిన నిర్మాత నాగార్జున.. సినిమా గురించి మరిన్ని ఆసక్తి కరమైన విషయాలు చెప్పారు.
ఓ అమ్మాయి తనకు ఎలాంటి రాకుమారుడు వస్తాడో అని కలలు కంటూ ఉంటుంది. ఆ రాకుమారుడు ఎలా ఉంటాడన్నదే ఈ సినిమా అంటూ సింపుల్ గా సింగిల్ లైన్ లో కథ చెప్పేసిన నాగార్జున.. స్టోరీ గురించి మరో సీక్రెట్ విప్పారు. నా కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన నిన్నే పెళ్లాడుతా లవ్ స్టోరీ అయినా.. అందులో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అలాగే మన్మథుడు ఫ్యామిలీ మూవీ అయినా సున్నితమైన ప్రేమ కథ ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కథ తయారు చేయమని కళ్యాణ్ కృష్ణకు చెప్పాను. అప్పుడు తను తీసుకొచ్చిన స్టోరీనే ఇది అన్నారు నాగార్జున.
సినిమా చాలా బాగా వచ్చిందని.. ప్రతీ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటుందని అన్న నాగార్జున.. ఈ మూవీలో తండ్రీ కూతుళ్లుగా నటించిన జగపతిబాబు- రకుల్ ప్రీత్ సింగ్.. మూవీ చూసిన తర్వాత కూడా ప్రేక్షకుల మనసుల్లో మెదులుతూనే ఉంటారని అన్నారు.