ఒకే వేదికపై తన కుమారులు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ వివాహం జరిపిస్తారేమో అని వచ్చిన ఊహాగానాలను ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కొట్టిపారేశారు. అలా ఒకేసారి తన ఇద్దరు కుమారుల పెళ్లి చేయబోమని, రెండు వేర్వేరు వివాహాల ద్వారా వచ్చే ఆనందాన్ని దూరం చేసుకోలేనని చెప్పారు. అయితే, పెళ్లి విషయంలో తన కుమారులకు మార్గదర్శకుడిగానే ఉంటాను తప్ప నిర్ణేతను మాత్రం కాదని చెప్పారు. ప్రస్తుతం కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో హాథిరామ్ బాబా పాత్రలో ఓం నమో వెంకటేశాయ అనే చిత్రంలో నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నెలలోనే ఆయన 57వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తన కుమారులకు సంబంధించిన విశేషాలు మీడియాకు పంచుకున్నారు. 'నాగచైతన్య, అఖిల్ వారి సోల్మేట్స్ను ఎంచుకున్నారు. ఇక కెరీర్ పరంగా ఎవరి దారిలో వారు వ్యక్తిగతంగా ముందుకు వెళుతున్నారు. అఖిల్ మాత్రం తాము ఆశించిన మార్క్ ఇంకా అందుకోలేదు. అందుకే రెండో చిత్రానికి సంబంధించి చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. మరో నెలలో ఆ చిత్రంపై ప్రకటన ఉంటుంది. వాళ్లిద్దరి వివాహాలు ఒకేసారి, ఒకే వేదికపై చేయడం లేదు. ఎందుకంటే ఆ రెండు పెళ్లిల్ల ద్వారా వచ్చే ఆనందం నేను పూర్తిగా ఆస్వాధించాలని అనుకుంటున్నాను' అని అన్నారు.