నారా రోహిత్.. ప్రయోగాల హీరో అనే చెప్పాలి. సెలక్టివ్ గా కథాంశాల్ని ఎంచుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఈ హీరో. ఆరేళ్ల లో ఏడు సినిమాల్లో నటించాడు. అయితే ఇకనుంచి స్పీడ్ పెంచేస్తానని చెబుతున్నాడు. అంతేకాదు.. ఈ ఏడాదిలో ఏకంగా నేను నటించిన మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ వేగం ఇక ముందూ కొనసాగుతుందని చెబుతున్నాడు. నేడు పుట్టినరోజు సందర్భంగా ఈ ముచ్చట్లు...
ఇంతకాలం సీరియస్ గా సాగే సినిమాల్లోనే నటించాను. సామాజిక నేపథ్యం సందేశం ఉన్న సినిమాలు చేశాను. వాటి వల్ల పేరొచ్చింది. కానీ కమర్షియల్ గా అనుకున్నంత లాభాలు రాలేదు. అందుకే ఇక నుంచి పంథా మారుస్తున్నా. మునుముందు ఫక్తు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తా. పండగలా వచ్చాడు ఆ తరహాలోని సినిమానే. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. అలాగే మురుగదాస్ ఇచ్చిన కథతో మాన్ కరాటే తమిళ్ లో విజయం సాధించింది. దాన్ని తెలుగు లో రీమేక్ చేస్తున్నా. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా కోసం బరువు తగ్గాను. అలాగే పవన్ సాధినేని దర్శకత్వంలో సావిత్రిలో నటిస్తున్నా. సాగర్ చంద్ర దర్శకత్వంలో 'అప్పట్లో ఒకడుండేవాడు' బివివి చౌదరి దర్శకత్వంలో 'వీరుడు' చిత్రాల్లో నటిస్తున్నా.
స్వతహాగా యుద్ధం క్రీడా నేపథ్యాలంటే చాలా ఇష్టం. ఆ తరహా కథలు వస్తే నటించడానికి సిద్ధమే. నిర్మాత గా అసుర తెరకెక్కించాను. అది మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇకముందు కొత్త దర్శకులతో విభిన్నమైన సినిమాలు చేయాలనుంది. బాలకృష్ణ తో సినిమా ఉంది అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అయితే అలాంటి అవకాశం వస్తే వదులుకోను. తప్పకుండా నేనే సినిమా నిర్మిస్తా.