జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్లు ఫాంలో ఉన్న టాలీవుడ్ హీరో. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసి.. ఒకదాన్ని మించి మరొక విజయం సాధిస్తూ దూసుకుపోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండడంతో ఇప్పటికే క్యూరియాసిటీ పెరిగిపోతోంది.
మరోవైపు ఇండస్ట్రీ జనాలతో ఎన్టీఆర్ తన పద్దతులు కూడా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. సహజంగా తన సినిమాల విషయాలు తప్ప మిగిలిన వాటిని పెద్దగా పట్టించుకోడు ఎన్టీఆర్. ఇతరుల సినిమాలకు ట్వీట్స్ చేయడం కూడా చాలాచాలా తక్కువ. కానీ బాబాయ్ బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి అభినందనలు చెబుతూ ట్వీట్ పెట్టాడు ఎన్టీఆర్. బాలయ్య ల్యాండ్ మార్క్ మూవీకి మద్దతు పలకడంలో ఆశ్చర్యం లేదు. కానీ శక్తి.. ఊసరవెల్లి చిత్రాల్లో విలన్ గా నటించిన విద్యుత్ జమాల్.. ఇప్పుడు హీరోగా నటించిన కమాండో2 చిత్రం తెలుగులో కూడా విడుదల కానుండడంతో.. దానికీ బెస్టాఫ్ లక్ చెప్పాడు.
తాజాగా మెగా హీరో సాయిధరం తేజ్ కొత్త సినిమా 'జవాన్' ప్రారంభం కాగా.. ఈ వేడుకకు హాజరైన ఎన్టీఆర్.. తొలి క్లాప్ కొట్టాడు. దీంతో మెగాఫ్యాన్స్ భలే ఖుషీ అయిపోయారు. ఇలా ఇండస్ట్రీలోని అన్ని వర్గాల వారిని కలుపుకుపోతుండడం.. అందరినీ సంతృప్తి పరిచేలా ప్రవర్తించడం చూస్తుంటే.. ఎన్టీఆర్ లో చాలా మార్పు కనిపిస్తోందని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.