రవితేజ సినిమాలు సరదాగా సందడిగా సాగిపోతుంటాయి. యూత్ ని ఊరిస్తూ .. మాస్ ని ఊపేస్తూ ఆయన సినిమాల్లోని కథ పరుగులు తీస్తూ వుంటుంది. ఇక ఇద్దరు కథానాయికలు వుంటే ఆయన చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తమన్నా .. రాశీఖన్నా ఆయన అల్లరి బారిన పడుతున్నారు. ఎందుకంటే, 'బెంగాల్ టైగర్' సినిమాలో ఆయనతో జోడీ కడుతున్నది వాళ్లిద్దరే కాబట్టి. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా, ఇప్పటికే సగానికి పైగా షూటింగును పూర్తి చేసుకుంది.
ఈ నెల 6వ తేదీ నుంచి మిగతా సన్నివేశాలను .. పాటలను చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోను .. పొల్లాచ్చిలోను ప్లాన్ చేశారు. ముందుగా ఇక్కడ షూటింగుని పూర్తిచేసుకుని ఆ తరువాత ఈ సినిమా యూనిట్ అక్కడికి వెళ్లనుంది. రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమా వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.