చిన్న చిత్రంగా తెరకెక్కి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న మరాఠీ చిత్రం సైరత్. వంద కోట్లు వసూళ్లు సాధించినట్టు సమాచారం. అప్పటిదాకా మరాఠీ సినిమా పరిశ్రమని లైట్గా తీసుకొన్నవాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మరాఠీ చిత్ర పరిశ్రమ కూడా ఓ బలమైనదే అనే విషయాన్ని సైరత్ చాటి చెప్పింది. పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం సృష్టించిన సంచలనాన్ని చూసి రీమేక్ రైట్స్ కోసం ఇతర ఇండస్ట్రీలన్నీ పోటీపడ్డాయి. తెలుగు నుంచైతే డజనుమందికి పైగా నిర్మాతలు మరాఠీ సినిమా ఆఫీసు ముందు క్యూ కట్టారట. అయితే మొత్తం సౌత్ రైట్స్ అన్నీ గుత్తగా రాక్ లైన్ వెంకటేష్ సొంతం చేసుకొన్నాడట. అన్ని భాషల్లోనూ ఒకేసారి సినిమాని తెరకెక్కించే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు వెర్షన్కి సంబంధించి హీరో దర్శకుల్ని కూడా కన్ఫమ్ చేసినట్టు సమాచారం. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఆ సినిమాని నిర్మించాలని రాక్లైన్ చర్చలు జరుపుతున్నాడట.
ఈమధ్యే 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని తీసిన పరశురామ్కి మాత్రం మళ్లీ చిన్న సినిమానే తీయడం ఇష్టం లేదట. కానీ మంచి కథ కాబట్టి ఆయన సినిమా చేయాలనే నిర్ణయించుకొన్నట్టు ప్రచారం సాగుతోంది. మరో రెండు మూడు వారాల్లో ఆ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పరశురామ్ విషయమేంటో కానీ.. బ్రహ్మానందం తనయుడు గౌతమ్కి మాత్రం ఇది గోల్డెన్ ఆఫరే. పల్లకిలో పెళ్ళికూతురు బసంతి సినిమాలతో ఆయనకి పరాజయాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కథానాయకుడిగా నిలదొక్కుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి సైరత్లాంటి క్లాసిక్తోనైనా ఆయన విజయం అందుకొంటాడేమో చూడాలి