మనం ఈ మధ్య కాలంలో చెప్పుకున్నట్లు.. సుకుమార్ ప్రొడక్షన్ లో డైరక్టు చేయడానికి డైరక్టర్లు దొరకడం కష్టమైపోయింది. ఎందుకంటే.. మనోడు సూర్య ప్రతాప్ కు డైరక్షన్ ఛాన్సు ఇచ్చినా.. చివరకు ''కుమారి 21 ఎఫ్'' సినిమా అంటే ఎవరైనా కూడా సుకుమార్ - రత్నవేలు - దేవిశ్రీప్రసాద్ - హెబ్బా పటేల్ అంటున్నారే తప్పించి.. దర్శకుడి పేరు మాత్రం చెప్పట్లేదు.
ఇకపోతే రెండో సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయాలని ఎదురు చూస్తున్నాడు సుకుమార్. కథ రెడీ అయ్యింది కాని.. దర్శకుడు మాత్రం చాలా కాలంగా సెట్ కాలేదు. ఇక నాన్నకు ప్రేమతో సినిమాకు కథ అందించి హుస్సేన్ షా కిరణ్ అనే కుర్రాడు ఉన్నాడు చూడండి.. ఇప్పుడు అతగాడికి ఛాన్సు ఇస్తున్నాడట. ఇతను ఆల్రెడీ ''మీకు మీరే మాకు మేమే'' అనే సినిమాను తీశాడు. గీతా ఆర్ట్స్ వారు ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నాం అంటూ అప్పట్లో చాలా హడావుడి చేశారు. కాని చివరకు సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు సుకుమార్ రాసిన ఓ కథకు.. మనోడు స్ర్కీన్ ప్లే మాటలు సమకూర్చుకుని డైరక్షన్ చేస్తున్నాడట.
మరి ఇతగాడికైనా డైరెక్టుగా డైరక్టర్ అనే పేరొస్తుందా? లేకపోతే ఇతను కూడా సుకుమార్ అనే గొడుగు క్రింద ఉండిపోయి.. అలా అలా మిగిలిపోతాడా? సినిమాను డైరక్ట్ చేయడమే కాదు.. డైరక్ట్ చేశాక ఈ క్రెడిట్ అంతా నాదే అని పేరు కూడా తెచ్చుకోవాలి సుమతీ!!