పాపం సందీప్ కిషన్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత మంచి స్థాయికి వెళ్తాడనుకుంటే.. ఆ ఒక్క సక్సెస్ తో సరిపెట్టుకున్నాడు కుర్రాడు. ఆ తర్వాత ఒకటీ అరా సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ.. వెంకటాద్రి.. తరహాలో నిఖార్సయిన హిట్టయితే ఒక్కటీ తగల్లేదు. అందులోనూ ఏడాది నుంచి కుర్రాడి పరిస్థితి మరీ కష్టంగా ఉంది. పోయినేడాది రన్.. ఒక్క అమ్మాయి తప్ప సినిమాలు తీవ్ర నిరాశను మిగల్చగా.. ఈ ఏడాది నగరం తో అతడికి పంచ్ పడింది. ఐతే సినిమాలు ఆడినా ఆడకున్నా.. సందీప్ కు అవకాశాలకైతే ఢోకా లేదు. తమిళంలో మాయవన్ తో పాటు సుశీంద్రన్ దర్శకత్వంలో నా పేరు శివ సీక్వెల్ చేస్తున్న సందీప్.. తెలుగులో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం సినిమాను ముగించిన సందీప్.. ఇటీవలే కృష్ణ కూతురు మంజుల దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో శమంతక మణి కూడా చేస్తున్నాడు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు సందీప్. మంచు లక్ష్మి దొంగాట తో పాటు ఇటీవలే రాజ్ తరుణ్ హీరోగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాను రూపొందించిన వంశీకృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు సందీప్.