వెంకటేష్ ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది దర్శకులు కథలు సిద్ధం చేసుకొన్నారు. వీరు పోట్ల - చంద్రశేఖర్ యేలేటి - క్రాంతిమాధవ్... ఇలా ఈ జాబితా చాంతాడంత ఉంటుంది. కారణమేంటో తెలియదు కానీ... ఆ కథలన్నీ ఒకొక్కటిగా ఇతర కథానాయకుల దగ్గరికి వెళ్లిపోతున్నాయనిపిస్తోంది. మోహన్ లాల్ - గౌతమిలతో చంద్రశేఖర్ యేలేటి తీయనున్న కథ కూడా వెంకీ కోసం సిద్ధం చేసిందే అని తాజాగా ఫిల్మ్నగర్ లో ప్రచారం సాగుతోంది. మరి అందులో నిజమెంతన్నది తెలియాల్సి వుంది. తన కోసం తీసుకొచ్చిన కథల్ని వింటున్న వెంకీ సానుకూలంగానే స్పందిస్తున్నాడట. కానీ రకరకాల కారణాలవల్ల అవి కార్యరూపం దాల్చడం లేదన్నది ఫిల్మ్ నగర్ వర్గాల మాట. దీంతో ఆ దర్శకులంతా ప్రత్యామ్నాయంగా మరో కథానాయకుడిని వెదుక్కొంటున్నారని సమాచారం.
వెంకటేష్ తో కుదరకపోవడంతోనే చంద్రశేఖర్ యేలేటి తాజాగా మోహన్ లాల్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకొన్నాడని చెబుతున్నారు. నిన్ననే ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడింది. అలాగే క్రాంతి మాధవ్ కూడా వెంకటేష్ కి చెప్పిన కథని నాగార్జునతో తీయాలని డిసైడైయ్యారని తెలుస్తోంది. వీరు పోట్ల కూడా వెంకీతో కాకుండా మంచు మనోజ్ తో `బిందాస్ 2` చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నాడు. ఇంతకీ వీళ్లు వెంకటేష్ తో సినిమా చేయలేకపోతుండటానికి కారణమేంటన్నది అంతుచిక్కడం లేదు. వెంకీ కూడా `గోపాల గోపాల` తర్వాత మరే సినిమాకి పచ్చజెండా ఊపలేదు. తండ్రి రామానాయుడు చనిపోవడంతో మధ్యలో కొద్దికాలం విరామం తీసుకొన్నారు. అయితే ఆ తర్వాత తనే స్వయంగా రచయితల్ని పిలిపించి కొన్ని కథలు సిద్ధం చేయమని చెప్పినట్టు తెలిసింది. కానీ ఆ కథలేవీ కొలిక్కి రాలేదు. రామానాయుడు స్టూడియో వర్గాలు మాత్రం వెంకీ వరుసగా సినిమాలు చేయడానికి దర్శకుల్ని లైన్లో పెట్టారని ఆ వివరాల్ని త్వరలోనే ప్రకటించబోతున్నాడని చెబుతున్నాయి.