జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీటవ్వబోతోందన్న వార్తలు నిజమే. దీనిపై అధికారిక సమాచారం వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. కొరటాలతో అతడి కొత్త సినిమాను నిర్మించబోయే నిర్మాత అనౌన్స్ చేశాడు. యువసుధ ఆర్ట్స్ బేనర్ మీద మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ సుధాకర్ చాన్నాళ్ల నుంచే టాలీవుడ్లో ఉన్నాడు. అనేక సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు. కొరటాల శివకు సుధాకర్ చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. నిర్మాత కావాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్న సుధాకర్ కు కొరటాల దర్శకుడు కావడంతో మార్గం సుగమమైంది. నేరుగా ఓ భారీ ప్రాజెక్టుతో ప్రొడ్యూసర్ గా మారే అవకాశం దక్కింది.
జనతా గ్యారేజ్ విడుదల కాకముందే మిక్కిలినేని సుధాకర్.. నిర్మాతగా తన తొలి సినిమా కొరటాల శివతో ఉంటుందని అనౌన్స్ చేశాడు. పోయినేడాది కొరటాల పుట్టిన రోజు సందర్భంగా అతను తన బేనర్లో ప్రొడక్షన్ నంబర్ 1గా కొరటాల సినిమా ఉంటుందంటూ యాడ్ కూడా ఇచ్చాడు. ఐతే అప్పుడు హీరో కన్ఫమ్ కాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ ఓకే అనడంతో.. అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. సినిమాపై అధికారిక ప్రకటన చేశాడు. జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్-కొరటాల జత కడుతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు.