బాలీవుడ్ భామ ఐశ్వర్యారాయ్ ఓ నిజజీవిత పాత్రను పోషించడానికి అంగీకరించింది. గూఢచర్యం కేసులో పాకిస్తాన్ లో పట్టుబడి, ఉరిశిక్షకు గురై జైలులో మగ్గుతున్న సమయంలో తోటి ఖైదీల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు సరబ్ జిత్ సింగ్ కథ ఆధారంగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో సరబ్ సోదరి డల్ బీర్ కౌర్ పాత్రను ఐశ్వర్య పోషిస్తోంది. 'మేరీకోమ్' ఫేం ఓమంగ్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
"ఇందులో డల్ బీర్ కౌర్ పాత్ర చాలా శక్తిమంతమైనది. దానిని ఐశ్వర్య పోషిస్తేనే నిండుతనం చేకూరుతుంది. ఆమె అంగీకరించడం సంతోషదాయకం" అంటున్నాడు నిర్మాత సందీప్ సింగ్. ఇక తన పాత్రను ఐశ్వర్య చేస్తున్నందుకు డల్ బీర్ కౌర్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాగా, ఐష్ ప్రస్తుతం 'జాజ్బా' అనే సినిమాలో లాయర్ వేషం వేస్తోంది.