ఏ సినిమానైనా కథా కథనాల తరువాత నిలబెట్టేది పాటలే. థియేటర్లో నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకులు మిగతా అంశాలను మరిచిపోవచ్చునేమోగానీ పాటలను మరిచిపోలేరు. ఎందుకంటే, ఎక్కడో ఒకచోట అవి వినిపిస్తూనే వుంటాయి. థియేటర్లో చూసిన దృశ్యంలోకి తీసుకుపోతూనే వుంటాయి. అనుభూతి ప్రధానంగా రూపొందుతాయి కనుకనే పాటలకి అంతటి శక్తి వుంటుంది. అందుకే ఆయా సినిమాల రేంజ్ ని బట్టి ఆడియో రైట్స్ కి ధరపలుకుతూ వుంటుంది. ఈ విషయంలో కూడా 'బాహుబలి' తన విశిష్టతను చాటుకున్నాడు.
ఈ సినిమా ఆడియో రైట్స్ ని 'లహరి' సంస్థ వాళ్లు 2 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కీరవాణి స్వరపరచిన పాటలు తేనెలో ముంచి తీసినట్టుగా వుండటమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. ఇక ఏ సినిమా అయితే జనం నోళ్లలో ఎక్కువగా నానుతూ వుంటుందో, ఆ సినిమాకి అన్ని విషయాల్లో మార్కెట్ బాగానే వుంటుంది. భారీ తారాగణం .. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం .. బలమైన కథా కథనాలు .. పసందైన పాటలు .. ఇలా అన్ని అంశాలపట్ల ప్రేక్షకులు ఆసక్తిని కలిగి వున్నారు గనుక, ఈ సినిమా ఆడియో రైట్స్ అనూహ్యమైన రేటుని అందుకోగలిగాయని అంటున్నారు.