శ్రీరామరాజ్యం సినిమాకు నయనతార ఎంత కీలకమో.. గౌతమీపుత్ర శాతకర్ణి కి హేమమాలిని కూడా అంతే ముఖ్యం అంటున్నాడు బాలయ్య. హేమమాలిని లేకుంటే శాతకర్ణి సినిమా లేదంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించాడు బాలయ్య. తన కెరీర్లో వందో సినిమాగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి గురించి బాలయ్య మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయనేమన్నాడంటే..
కొందరు లేకపోతే కొన్ని సినిమాలుండవు. ఒక నయనతార లేకపోతే శ్రీరామరాజ్యం లేదని అప్పుడన్నాను. ఇప్పుడు హేమమాలినిగారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదని చెప్తున్నాను. నా తల్లి పాత్రను ఆమె అద్భుతంగా పోషించారు. దర్శకుడు క్రిష్ మా అందరి నుంచీ మంచి హావభావాలు రాబట్టారు. సినిమాకి అన్నీ తానై వ్యవహరించారు. అద్భుతంగా వచ్చింది సినిమా. డిసెంబర్ 16న పాటలతో పాటు ట్రైలర్ కూడా విడుదలవుతుంది.
మనకంటూ ఓ దేశాన్నిచ్చి.. మనదనే ఓ చరిత్రనిచ్చి.. ఓ వారసత్వాన్నిచ్చి.. ప్రపంచపటంలో ఈ దేశానికి ఓ గౌరవాన్నిచ్చి.. ఈ పుడమి గర్భంలో కలిసిపోయిన ఓ కానరాని భాస్కరుని వీరగాథే ఈ ?గౌతమీపుత్ర శాతకర్ణి?. ఈ విశాలమైన దేశాన్ని స్థాపించింది ఓ తెలుగువాడని ఎంతమందికి తెలుసు? తన వెన్నెముకపై తెలుగుజెండాను దేశవ్యాప్తంగా మోసిన మహానుభావుడు నందమూరి తారకరాముని వారసునిగా ఈ గౌతమీపుత్ర శాతకర్ణి వీరగాథను చాటిచెప్పడం దైవేచ్ఛగా భావిస్తున్నా. మన దురదృష్టం కొద్దీ చరిత్రలో ఆయన గురించి చదువుకుంది చాలా తక్కువ. ఆయన జీవిత చరిత్రను చాటడానికే సినిమాగా తీయాలని నిర్మాతలు.. దర్శకుడు సంకల్పించారు. మా అందరినీ ఆ భగవంతుడే కలిపాడు అని బాలయ్య చెప్పాడు.