ఎవ్వరూ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రముఖ నటుడు భానుచందర్ సూచించారు. ఆర్టిస్ట్ లు టెక్నీషియన్స్ డ్రగ్స్ కు బానిసలవడం తనకు నచ్చలేదని అన్నారు.
ఇది చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్ కు బానిసలైన విషయమై మీడియా ఆయనను ప్రశ్నించింది. గతంలో తాను కూడా డ్రగ్స్ కు బానిసని భానుచందర్ తెలిపారు. అయితే ఆ సమయంలో కెరీర్ పరంగా చాలా దెబ్బతిన్నానని చెప్పారు. అప్పటికి తనకు ఇంకా పెళ్లి కాలేదని డ్రగ్స్ మత్తులో కూరుకుపోయానన్నారు. అయితే.. దాని నుంచి బయటపడేందుకు మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడిందన్నారు. తన అన్నయ్య ఇచ్చిన స్ఫూర్తితో తాను మామూలు మనిషినయ్యానని చెప్పారు.
ఆ తర్వాత తాను కొత్త జీవితాన్ని ప్రారంభించానని తెలిపారు. ఆ తర్వాత తాను కెరీర్ పై దృష్టి పెట్టానని చెప్పారు. ఆ మహమ్మారి బారి నుంచి బయటపడి ఈ రోజు సినీ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు సంపాదించుకున్నానని చెప్పారు. యువతను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ డ్రగ్స్ జోలికి వెళ్లకండి. క్రమశిక్షణతో ఉంటే మనకు కావాల్సినవన్నీ అవే వస్తాయి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ వస్తుంది. వయసుతో పనిలేదు ఎవరైనా నేర్చుకోవచ్చు.