చిరంజీవి ధ్యాసంతా ఇప్పుడు సినిమాలపైనే పెట్టినట్టున్నాడు. వచ్చిన ప్రతి సినిమానీ విడుదలైన ప్రతి టీజర్ ని ఆయన మిస్ కాకుండా చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఇదివరకంటే రాజకీయాలతో బిజీ బిజీగా గడపాల్సి వచ్చేది కాబట్టి ఎప్పుడు ఎవరెక్కడ ఎలాంటి సినిమాలు చేస్తున్నారో చిరుకి తెలిసేది కాదు. కేవలం తన కుటుంబ కథానాయకులకి సంబంధించిన సినిమాల గురించి మాత్రమే ఆయన ఆరాలు తీస్తూ వెళ్లిపోయేవారు. కానీ ఇటీవల రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకొన్నాక చిరు కాన్సంట్రేషన్ మొత్తం సినిమాలపైనే పెట్టేసినట్టు తెలుస్తోంది.
ఈమధ్య విడుదలైన బాబు బంగారం టీజర్ ని కూడా చిరు చూశాడట. చూడటమే కాదు...చాలా బాగుందని కూడా మెచ్చుకొన్నారట. ఆ విషయాన్ని చిత్ర దర్శకుడు మారుతి స్వయంగా బయటపెట్టాడు. `బాస్ కాంప్లిమెంట్లు ఎప్పటికీ భలే కిక్కునిస్తుంటాయని. టీజర్ బాగుందని మెచ్చుకొన్నార`ని మారుతి ట్వీట్ చేశాడు. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం బాబు బంగారం. నయనతార కథానాయికగా నటించింది. ఇటీవలే టీజర్ విడుదలైంది. అందులో వెంకటేష్ స్టైల్గా కనిపించాడు. అయ్యో అయ్యో అయ్యయ్యో అనే డైలాగ్ చెప్పి మరోసారి అలరించాడు. ఇప్పటికే మంచి బజ్ని క్రియేట్ చేసిన ఈ చిత్రానికి ఇప్పుడు చిరు ప్రశంసలు కూడా లభించడం విశేషం.