అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం వచ్చినపుడు మోహన్ బాబు వేదికెక్కి ఏం మాట్లాడాడో.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి రిటార్ట్ ఇచ్చాడో.. ఆ వేడుక ఎంత వివాదాస్పదమైందో గుర్తుండే ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవ వేడుకల్లో సైతం ఇలాంటి వివాదమే చెలరేగింది. మెగాస్టార్ చిరంజీవికి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు మధ్య అగాథం ఎంతుందో ఆ రెండు వేడుకల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో శనివారం విశాఖపట్నంలో జరగబోయే వేడుక ఆసక్తి రేకెత్తిస్తోంది. మోహన్ బాబు 40 ఏళ్ల నట ప్రస్థానం పూర్తయిన నేపథ్యంలో విశాఖలో భారీ వేడుక నిర్వహిస్తోంది మంచు ఫ్యామిలీ.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథుల్లో ఒకడిగా వస్తున్నాడు. ఆయనతో పాటు తెలుగు పరిశ్రమ నుంచే కాక వివిధ ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. బడా రాజకీయ నేతలు కూడా వస్తున్నారు. ఐతే అందరి దృష్టి ప్రధానంగా చిరు మీదే ఉండనుంది. ఆయన్ని మోహన్ బాబు ఎలా రిసీవ్ చేసుకుంటారు.. వేదిక మీద చిరు ఏం మాట్లాడతారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరు వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేసే అవకాశాలు లేవు కానీ.. మోహన్ బాబే తనదైన శైలిలో ఏదైనా చురకలంటిస్తాడేమో చూడాలి. ఆ సంగతలా వదిలేస్తే ఈ వేడుకను కనీ వినీ ఎరుగని రీతిలో చేయడానికి మంచు ఫ్యామిలీ భారీ ఏర్పాట్లే చేస్తోంది. వజ్రోత్సవం కంటే మిన్నగా ఈ వేడుకను నిర్వహిస్తామని వారు ప్రకటించిన సంగతి తెలిసిందే.