ఓవర్సీస్ మార్కెట్ లో వెనకబడిన యంగ్ స్టార్ కథానాయకుడు అంటే మొదట రామ్ చరణే గుర్తుకొస్తాడు. మగధీర మినహా ఆయన సినిమాలేవీ అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. అందుకే ఈసారి ఓవర్సీస్ పై చరణ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఆ మేరకు తనతో తదుపరి సినిమాని తీయబోతున్న మైత్రీ మూవీస్ బ్యానర్ ని కూడా రంగంలోకి దింపినట్టు సమాచారం. మైత్రీ మూవీస్కి ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచే చరణ్ కొత్త చిత్రం ధృవ విడుదల కాబోతోందట. అక్కడ ప్రీమియర్లు ఏర్పాటు చేసి వాటికి స్వయంగా హాజరై వసూళ్లని పెంచాలనుకొంటున్నాడట చరణ్. మైత్రీ బ్యానర్ లో సుకుమార్ తో చేయనున్న కొత్త సినిమా విడుదలయ్యేనాటికి ఓవర్సీస్లో ఓ క్రేజ్ నెలకొనేలాగా వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చరణ్ భావిస్తున్నాడు. ఓవర్సీస్ లో ఆయనకి పెద్దగా మార్కెట్ లేకపోవడంతో `ధృవ`పై డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపలేదట. అందుకే చరణ్ మైత్రీ మూవీస్ సంస్థనే రంగంలోకి దింపి వాళ్లతోనే మార్కెట్ చేయిస్తున్నారట. బాగా మార్కెట్ చేసి చరణ్ క్రేజ్ని పెంచితే అది మైత్రీ మూవీస్ చేసే కొత్త సినిమాకి కూడా బాగా పనికొస్తుంది. అందుకే వాళ్లు కూడా ప్రత్యేకమైన ఆసక్తితో సినిమాని ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నట్టు తెలిసింది.
తెలుగు సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ కీలకంగా మారింది. సినిమా బాగుందంటే అక్కడ వసూళ్ల వర్షం కురుస్తుంటుంది. నితిన్ - నానిలాంటి హీరోల సినిమాలు కూడా ఓవర్సీస్ మార్కెట్లో దుమ్ము రేపుతుంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాలైతే మిలియన్ల డాలర్లని సంపాదిస్తుంటాయి. అక్కడి వసూళ్లతోనే నిర్మాతకి సగం పెట్టుబడి వచ్చేస్తుంటుంది. అందుకే స్టార్ కథానాయకులంతా కూడా తమ సినిమాల్లో ఓవర్సీస్ జనాలకి నచ్చే అంశాలు ఏమున్నాయా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటుంటారు. వాళ్ల టేస్టుకి తగ్గట్టుగా వినోదం ఉండేలా దర్శకులతో ప్రత్యేకంగా స్క్రిప్టుల్లో మార్పు చేర్పులు చేయిస్తుంటారు. మహేష్ లాంటి కథానాయకుడైతే ఆ విషయంలో చాలా పర్ ఫెక్ట్ గా ఉంటాడు. అందుకే ఆయన ఫ్లాపు సినిమాలు కూడా అక్కడ మంచి వసూళ్లని సొంతం చేసుకుంటుంటాయి. చరణ్ కూడా ఓవర్సీస్ ప్రాధాన్యాన్ని గుర్తించి ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగాడన్నమాట.