తెలుగు సినీ పరిశ్రమలో రెండు, మూడు దశాబ్దాలుగా టాప్ హీరోలుగా కొనసాగుతూ వస్తోన్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు నటించబోయే సినిమాలు ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ సినిమాలుగా చెప్పుకోవచ్చు. చిరంజీవి సినిమా ఆయన కెరీర్కు 150వ సినిమా కాగా, బాలకృష్ణ సినిమా ఆయన కెరీర్కు 100వ సినిమా. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టులు కొద్దికాలంగా విపరీతమైన ప్రచారం పొందుతూ వస్తున్నాయి. ఇంకా సెట్స్పైకి వెళ్ళని ఈ రెండు సినిమాలకూ సంగీత దర్శకుడు ఒక్కరే కావడం విశేషంగా చెప్పుకోవాలి.
రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ రెండు సినిమాలకూ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. చిరంజీవి సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రెండు ప్రతిష్టాత్మక సినిమాల్లో భాగమవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాని, ఈ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించి రెండు సినిమాలకు మంచి ఆడియో ఇచ్చేందుకు కృషి చేస్తానని దేవిశ్రీ ఈ సందర్భంగా తెలిపారు.