తొలిసారి ఇద్దరు మెగా హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయిప్పుడు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ల సినిమాలు ఒకే రోజు థియేటర్లలో దిగేందుకు ఆస్కారం కనిపిస్తోంది. ఈ నెల 21న వరుణ్ తేజ్ సినిమా ఫిదా విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీని రిలీజ్ డేట్ గత నెలలోనే ప్రకటించారు. ఇప్పుడు ఇప్పుడు సడెన్ గా సాయిధరమ్ సినిమా అదే తేదీన రిలీజ్ కోసం చూస్తోంది. ఆ సినిమానే.. నక్షత్రం.
ఎప్పుడో రెండేళ్ల కిందట మొదలై.. అనేక కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన నక్షత్రం సినిమాను ఎట్టకేలకు ఈ నెలలోనే విడుదల చేయాలని చూస్తున్నారు. మేలో రిలీజ్ అని చెప్పి హడావుడి చేశారు కానీ.. తర్వాత చప్పుడే లేదు. ఇప్పుడు ఉన్నట్లుండి బుధవారం నక్షత్రం ఆడియో వేడుక చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కూడా ఫిక్సయ్యారు. ఐతే సరైన డేట్ కోసం చూస్తే.. 21 బెటర్ అనిపిస్తోందట. నెలాఖర్లో రాబోతున్న ‘గౌతమ్ నంద’ కొంచెం పెద్ద స్థాయి సినిమానే. ఆ రోజు మరో సినిమా కూడా రిలీజయ్యే అవకాశముంది. ఇక 14వ తేదీకి రిలీజ్ కు రెడీ చేయడమంటే కష్టం. అందుకే ఫిదా రిలీజయ్యే 21నే నక్షత్రం ను విడుదల చేద్దామనుకుంటున్నారట. ఫిదా మీద పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ అదేమీ మాస్ సినిమా కాదు కాబట్టి.. పోటీ వల్ల పెద్దగా నష్టం ఉండదు. పైగా ‘నక్షత్రం’ దానికి పూర్తి భిన్నమైన సినిమా.